నాగపూర్‌ తరహాలో కరీంనగర్‌లో నిరంతర నీటి సరఫరా

అధ్యయనానికి ఎమ్మెల్యేల బృందం
కరీంనగర్‌,మే3(జ‌నం సాక్షి): కరీంనగర్‌లో నిరంతర నీటి సరఫరా అందించే విషయంలో స్టడీ టూర్‌ కోసం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్లు నాగపూర్‌ వెళ్లనున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో అక్కడ కొనసాగుతున్న  నీటిసరఫరా, పారిశుధ్యం, మురికినీరు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను పరిశీలించ నున్నారు. అక్కడి విధానం పరిశీలించాక దాని అమలుకు సంబంధించి చర్చిస్తామని ఎమ్మెల్యే గంగుల అన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా నగరంలో 24 గంటల నీటి సరఫరాను పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఈ విషయంలో పబ్లిక్‌హెల్త్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వైపు నగరంలో అర్బన్‌ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే నగరంలోని పలు జోన్లల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద 24 గంటల నీటి సరఫరా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో నీటి సరఫరా పర్యవేక్షణకు ఆస్కీ సంస్థకు బాధ్యతలు ఇవ్వగా, 24 గంటల నీటి సరఫరాకు సంబంధించి డీపీఆర్‌ పనులను ఆర్వీ కన్సల్టెన్సీ చేపడుతున్నది. ఈ నెలల్లోనే కన్సల్టెన్సీ ప్రతినిధులు తమ ప్రజెంటేషన్‌ను అందించనున్నారు. కాగా, 24 గంటల నీటి సరఫరా వల్ల వచ్చే లాభాలపై ప్రజాప్రతినిధులకు అవగహన కల్పించేందుకు స్టడీ టూర్‌ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. నాగపూర్‌లో ఇప్పటికే విశ్వ సంస్థ ఆధ్వర్యంలో 24 గంటల నీటి సరఫరా అందిస్తున్నారు. దీని వల్ల నీటి వృథా తగ్గడం, కలుషిత నీరు లేకపోవటం, ఇంటి యజమాన్యులకు కూడ నల్లా బిల్లు తక్కువగానే వస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాలన్నింటినీ కార్పొరేటర్లకు వివరించడానికి వీలుగా టూర్‌ను రూపొందించారు. ఇదిలావుంటే ఈ వేసవిలో నీటి సరఫరా విషయంలో ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినా అవసరం లేదనీ, ఎల్‌ఎండీలో మరో ఏడాదికి సరిపడా తాగునీరుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు.అవగాహన లేని, పనికి రాని పార్టీలు, నాయకులు ఎల్‌ఎండీలో నీటిమట్టంపడిపోయిందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ల వద్ద ఉన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల రెండు, మూడు రోజులు నీటి సరఫరాలో ఇబ్బందులు కలిగాయని తెలిపారు. నగరానికి నీటి సరఫరా అందించే ఇన్‌టెక్‌ వాల్‌ 860 అడుగుల్లో ఉందని తెలిపారు.
ప్రస్తుతానికి రోజుకు 53 క్యూసెక్కులు తీసుకుంటున్నామనీ, ఇందులో 8 క్యూసెక్కుల చొప్పున సిద్దిపేట, సిరిసిల్లకు, 35 క్యూసెక్కులు కరీంనగర్‌కు, రెండు క్యూసెక్కులు వేములవాడకు డ్యాం నుంచి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.  లెక్కలు తెలియకుండా డ్యాంలో నీటిమట్టం తగ్గిందంటూ కొంతమంది పనికిరాని ఆరోపణలు చేస్తున్నారనీ, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. /ూష్ట్ర సర్కారు సూచనల మేరకు నగరంలో 24 గంటల నీటి సరఫరా అందించే విధానంపై కార్పొరేటర్లు, అధికారుల అవగాహన కోసం నాగపూర్‌లో స్టడీ టూర్‌ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆస్కీ సంస్థను అడ్వైయిజరీగా ఏర్పాటు చేశామనీ, డీపీఆర్‌కు సంబంధించిన ఆర్వీ కన్సల్టెన్సీకి బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. నాగపూర్‌ స్టడీ టూర్‌లో నీటి సరఫరాతోపాటు పారిశుధ్యం, సీవరేజ్‌ ప్లాంట్లను పరిశీలిస్తామని తెలిపారు.
————-