నిబంధనలకు విరుద్దంగా చేపల వేలం

గ్రామ సర్పంచ్‌పై చర్యకు గంగపుత్ర సంఘం డిమాండ్‌
నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): భీంగల్‌ మండలంలోని రహత్‌నగర్‌ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట నిర్వహించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ ఏడీకి పిర్యాదు చేసినట్లు గంగపుత్ర చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెరువులో చేపలు పట్టే అధికారం మత్స్యకారులయిన గంగపుత్రులకు మాత్రమే ఉంటుందని, చెరువును వేలం వేసే అధికారం ఎవరికి లేదన్నారు. ప్రభుత్వం గంగపుత్రులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, కేవలం ఓటు బ్యాంకు కోసం జీలో 6 విడుదల చేసిందని, ఈ జీవోను రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, నారాయణ తదితరులు ఉన్నారు