*నిమజ్జనం ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

*జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్*
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 3 : గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతాలలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానది దగ్గర నిమజ్జనం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ రోజు నిమజ్జనం చేసేందుకు అధిక గణనాథులు వచ్చే అవకాశం ఉన్నందున బీచుపల్లి కృష్ణానది ఒడ్డున  నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలీస్ బందోబస్తును పర్యవేక్షించి క్రేన్స్ సహాయంతో నిమజ్జనం చేసే స్థలాన్ని పరిశీలించారు. కృష్ణానది ప్రవాహం దగ్గర బారికేట్స్ నీ పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు  సూచనలు చేశారు. నిమజ్జనం సమయంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లతో నదిలో ప్రవాహంపై సమీక్షించి ప్రస్తుత ఏర్పట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది, వైద్యబృందం, విద్యుత్ శాఖ, రెవిన్యూ సిబ్బంది, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులకు అందుబాటులో ఉండి నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అలాగే నిమజ్జనం చేసేందుకు వచ్చిన గణనాథుల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో   అలంపూర్ సిఐ సూర్యనాయక్, డిఎస్పీ ఎన్.సి హెచ్ రంగా స్వామి, ఇటిక్యాల ఎస్సై గోకారి, తాహసిల్దార్ సుబ్రమణ్యం, ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.