నువ్వు రాష్ట్రపతికే గులాం

కాంగ్రెస్‌ అధిష్టానానికి తొత్తుగా ఎందుకు మారవ్‌
గవర్నర్‌పై నారాయణ ఫైర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ కేవలం రాష్ట్రపతికి మాత్రమే గులామని, నరసింహన్‌ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనభీ ఆజాద్‌తో భేటీ కావడంలో ఆంతర్య మేమిటని మండిపడ్డారు. ఇంతకుముందు పార్టీ నాయకులెందరో గవర్నర్లుగా పనిచేశారని వారిలో ఎవరూ ఈ విధంగా ఇంతగా గులాంగిరీ చేయలేదని తెలిపారు.
గవర్నర్‌ కాంగ్రెస్‌ పెద్దలను ప్రసన్నం చేసుకుని పదవిలో కొనసాగేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప, రాజ్యాంగబద్ధంతా పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడటం లేదన్నారు. గవర్నర్‌ కాంగ్రెస్‌కు తొత్తులా వ్యవహరించడం దారుణమన్నారు. ఆయన తీర్చు మార్చుకోవాలని, ఢిల్లీ పర్యటనలను రాష్ట్రపతి భవన్‌కే పరిమితం చేసుకుంటే మంచిదని హితవు పలికారు.