నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్దం

గుర్తింపు కార్డు చూపి ఓటేయాలి

కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ఈనెల 31న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఓటేయనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లకు మార్గదర్శకాలు జారీచేశామని తెలిపారు. గుర్తింపు కార్డులను చూపించి 31న రెవెన్యూ డివిజన్‌కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో 7పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్గొండ డివిజన్‌లో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, మిర్యాలగూడలో జడ్పీ ఉన్నత పాఠశాల బకల్‌వాడీలో, దేవరకొండ డివిజన్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో, భువనగిరి డివిజన్‌కు ఎంపీడీఓ కార్యాలయంలో, సూర్యాపేట డివిజన్‌కు ఎంపీడీఓ కార్యాలయంలోని స్త్రీ శక్తి భవనంలో, కోదాడ డివిజన్‌కు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, చౌట్టుప్పల్‌ డివిజన్‌కు ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిస్టిబ్యూష్రన్‌, రిసెప్షన్‌ కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాలలో, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. పోలింగ్‌రోజున పోలింగ్‌ బూత్‌లోకి ఒక్కొక్కరుగా ఓటు వేయాలని, సమూహంగా వెళ్లి ఓట్లు వేయవద్దన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ పనులకు నోడల్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. పోలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ ఏజెంట్లను, నేరచరిత్ర కలవారిని, ప్రభుత్వ ఉద్యోగులను, రాజకీయ పదవుల్లో ఉన్న వారిని నియమించవద్దన్నారు. పోలింగ్‌రోజున మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనలు ఉంటే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఎలక్టాన్రిక్‌ గ్యాడ్జెస్‌, మొబైల్‌ ఫోన్లు, పెన్నులు తీసుకురావద్దన్నారు. ఓటు బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్ధికి ఎదురుగా ఊదా రంగు స్కెచ్‌తో ప్రాధాన్యత క్రమంలో అంకె ద్వారా ఓటేయాలన్నారు.