పంచాయతీ ఫైల్‌ ఎన్నికల సంఘానికి

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ : రమాకాంత్‌
హైదరాబాద్‌, జూలై 1 (జనంసాక్షి) : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఎన్నికల రిజర్వేషన్లను ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించిన మీదట ఫైలును రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21,590 పంచాయతీలు ఉండగా వాటిల్లో మహిళలకు 50శాతం స్థానాలను కేటాయించారు. అలాగే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దమాషా పద్ధతిన స్థానాలు కేటాయించారు. ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం పంపిన నివేదిక అందిందని రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.