పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే  పథకం

రైతులు అందరికీ సాయం అందుతుంది
ఇబ్బందులుంటే  పరిష్కరిస్తాం
నల్లగొం,డిసెంబర్‌(జ‌నంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూములకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరించి, వారికి కూడా పంట పెట్టుబడి అందిస్తామని రతైఉ సమన్వయ సమితి ఛైర్మన్‌ గుత్తా సుకేందర్‌ రెడ్డి అన్నారు.  రైతులకు పంట పెట్టుబడి ఇచ్చే ఈ రైతుబంధు పథకం ఇక నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సిఎం కేసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని, దానికి ప్రజల ఆమోదం ఉందని ఎన్‌ఇనకల ఫలితాలు వెల్లడించాయని అన్నారు. ఇప్పుడు రైతు పంట పెట్టుబడి కోసం ఎవరివైపు చూడకుండా ఉండేందుకు ఎకరానికి 4000 చొప్పున ఏటా 8000 రూపాయల ఆర్ధిక సాయం చేసినా,దానిని పదివేలకు పెంచుతామన్న హావిూని కూడా నిలబెట్టుకుంటామని  చెప్పారు. దేశంలో ఇంత వరకు రైతుకు పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగానీ, నాయకులుగానీ లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పంట పెట్టుబడి పథకంవైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, వ్యవసాయానికి కనీసం రెండు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితిని మార్చి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారని, కోటి ఎకరాలను మాగాణాగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని అన్నారు. రైతులకే కాకుండా పేదింట్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని మొదట్లో 51వేల రూపాయలు ఇచ్చారని, అది సరిపోదని దానిని 75వేల రూపాయలకు పెంచారని, అదీ చాలడం లేదని ఇప్పుడు లక్షా 116 రూపాయలను ఇస్తున్నారన్నారు. పేదింట్లో ఆడపిల్ల గర్భం దాల్చితే ప్రసవం అయ్యే వరకు పని చేయాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్‌ ఇక అలాంటి పరిస్థితి ఉండొద్దని ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు కలిపి 13వేల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తల్లిబిడ్డలను అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఇంతటి మంచి పథకాలు అమలు చేస్తున్న సిఎం కేసిఆర్‌ను నిండు మనసుతో ప్రజలు దీవించారని అన్నారు. అందుకు కెసిఆర్‌ కూడా తన పెద్దమనసు చాటుకుంటున్నారని అన్నారు.