పాము కాటుకు గురై మృతి చెందిన సాయిరాజ్ కుటుంబాన్ని పరామర్శించిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి..

సాయిరాజ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి):
బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో పాముకాటుకు గురై మరణించిన ధుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ కుటుంబాన్ని గురువారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి సాయిరాజ్ మృతి తల్లిదండ్రుల శోకం తీరనిదని కుటుంబానికి ఉపశమనం కలిగించడానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నామని సాయి రాజ్ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయడంతో పాటు మా తరఫున స్వయంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి త్వరలోనే వారి కుటుంబానికి అందిస్తామన్నారు. సాయిరాజ్ తల్లికి బాన్సువాడ బీసీ బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పించడం జరిగిందని, ముఖ్యమంత్రి సహాయని ద్వారా ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సాయం అందించడానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన అన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్ తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సభాపతి పోచారం విద్యార్థి సాయిరాజ్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తెరాస రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, తెరాస నాయకులు శ్రీనివాస్ యాదవ్, కిషోర్ యాదవ్, స్థానిక సర్పంచ్ దుర్గం శ్యామల, ఎంపీటీసీ కుమ్మరి నారాయణ, మాజీ సర్పంచ్ ఏడే మోహన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు