పాలమూరు పౌరుషం చూపించాలి

కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలి

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ పిలుపు

మహబూబ్‌నగర్‌,జూలై7(జ‌నం సాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. ఆ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రానికి సవిూపంలోని దివిటిపల్లిలో ఐటీ టవర్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్‌ పార్టీ నేతలకు రుచి చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్‌ నేతలే కారణమని మంత్రి ధ్వజమెత్తారు. దేశాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకున్నది కాంగ్రెస్‌ నేతలే అని దుయ్యబట్టారు. ఏనాడూ అభివృద్ది పట్టకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంచి పని చేద్దామంటే.. కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కొందరు విమర్శించడం సరికాదన్నారు. దశాబ్దాల పాటు పాలమూరు వెనకబాటుకు జిల్లా కాంగ్రెస్‌ నేతలే కారణమని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌. పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్‌ నేతలు చేసిందేమి లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. పాలమూరు అభివృద్ధిని కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని కోపోద్రిక్తులయ్యారు. తమ పునాదులు కదులుతాయనే కాంగ్రెస్‌ నేతలు చిల్లరమల్లర కేసులు పెడుతున్నారని తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులకు రూ. 25 కోట్ల వ్యయంతో హ్యాండ్లూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపి జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

————–