పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతం

– 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు

నెల్లూరు,నవంబరు 7 (జనంసాక్షి): శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సఫలీకృతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.అంతకుముందు పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం 10 నిమిషాలు వాయిదా పడింది. రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్‌ ప్రయోగించారు. కరోనా ప్రతికూలతను అధిగమించి మరీ లక్ష్యం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జగన్‌ మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ అభింనందించారు. 10 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని.. ఇస్రో భవిష్యత్తు ప్రాజెక్టులూ విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.