పెళ్లికోసం ప్రియురాలి రాస్తారోకో

చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామానికి చెందిన నెమ్మాది శిరీష, ఎపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శిరీష గత రెండు రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోమని అడుగుతున్నా అతను నిరాకరించారు. దీంతో బాధితురాలు చిలుకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మండల కేంద్రంలోని కోదాడ-హుజూర్‌నగర్‌ రహదారిపై శిరీష ఆమె తల్లిదండ్రులు రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. కోదాడ సీఐ శ్రీనివాసనాయుడు స్పందించి వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకోను విరమించారు.