పేదల దోస్తీ .. బస్తీ దవాఖాన .

..

బస్తీల సుస్తీని పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు

సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే సర్కార్ వైద్యం పట్ల ప్రజలకు విశ్వాసం

– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): వైద్య రంగంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కుడకుడలో బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.బస్తీలలో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పేదలకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, బస్తీ దవాఖానాల ద్వారా మంచి వైద్యంతో పాటు పైసా ఖర్చు లేకుండా వైద్యం , 120 రకాల పరీక్షలు, మందులు అందుతున్నాయన్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కెసిఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.బస్తీ దవఖానాల్లో డాక్టర్, నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. 2014కు ముందు గత పాలకుల హయాంలో మామూలు రోగాలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడటంతో పాటు ప్రజలు అనేక అంటువ్యాధులతో ఇబ్బంది పడిన పరిస్థితులుండేవని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆరోగ్య స్థితిగతుల విషయంలో అనేకమైన అభివృద్ధి జరిగిందన్నారు.మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యంను అందిస్తున్నారని కొనియాడారు.గతంలో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఆమడ దూరం పారిపోయే రోజుల నుండి ప్రసూతి అంటే ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళాలనుకునే విధంగా వైద్య రంగం అభివృద్ధి జరిందన్నారు.మండల కేంద్రాల్లో , మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిత్యం పెరుగుతున్న రోగుల తాకిడే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శమని అన్నారు.వైద్యం, విద్య విషయంలో ఏ సమాజమైతే ముందుంటుందో ఆ సమాజంను మంచి సమాజంగా గుర్తింపు లభిస్తుందని అన్నారు.సీఎం కేసీఆర్ వైద్య రంగం కోసం తీసుకున్న అనేక పథకాలు,చర్యలతో రాష్టం ఆరోగ్య తెలంగాణగా మారిందన్నారు.సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం బస్తీ దవాఖానాలో మంత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పెర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్ పద్మ , డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం , పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది బిక్షం, నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.