పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలి

– టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌
కరీంనగర్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : రాహుల్‌ గాంధీ సభలో సీఎం కేసీఅర్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ అధ్య క్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో 15వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్న గెల్లు, తెలంగాణ ప్రభుత్వం  కల్పించిన ఉద్యోగాలపై పొన్నం బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగిన పొన్నం ప్రభాకర్‌ తన ఐదేళ్ల పదవీ కాలంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. తెలంగాణ వచ్చినంకనే కరీంనగర్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రని గెల్లు శ్రీనివాస యాదవ్‌ విమర్శించారు.