ప్రజల వైపు నిలబడితే ఉద్యమంలో కలిసి రండి.

 

అధికార పార్టీ కౌన్సిలర్లకు ఐక్యవేదిక నాయకుల సవాల్.

దిశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 4 (జనం సాక్షి). ప్రజల సమస్యలపై పట్టింపు ఉంటే ప్రజల పక్షాన నిలబడి విలీన గ్రామాల ఐక్యవేదిక ఉద్యమంలో కలిసి రావాలని అధికార పార్టీ కౌన్సిలర్లకు ఐక్యవేదిక నాయకులు సవాలు విసిరారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దమ్మ ఆలయం వద్ద సమావేశమైన ఐక్యవేదిక నాయకులు భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగరాజు గౌడ్ చేన్నమనేని కమలాకర్ రావులు మాట్లాడుతూ ఇటీవల అధికార పార్టీ నాయకులు విలీనం వల్ల అభివృద్ధి జరుగుతుందంటూ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. ఒక్క పెద్దూరు గ్రామంలోనే 1200 మంది, బోనాలలో 400 మందికి ఉపాధి హామీ ద్వారా చేయూత అందేదని ప్రస్తుతం చేతిలో పని లేక పేద కుటుంబాలు కోట్లలో ఉపాధి నష్టపోయిన విషయం నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. అనేకమంది ఉపాధి హామీ పనులు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామసభలు కు కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులు చేసిన నిర్వాకం వల్లే ప్రజలు సమస్యల పాలవుతున్నారని మండిపడ్డారు. విలీన గ్రామాలపై అనేక రకాలుగా వివక్ష కొనసాగుతుందని సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి విలీన గ్రామాలను అర్బన్ మండలం గా మార్చి తిరిగి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడమే పరిష్కారమని అన్నారు. విలీన గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అర్బన్ మండల ఏర్పాటు చేసే వరకు దిశలవారీగా ఉద్యమం చేపడతామని అన్నారు. అవసరమైతే తమ కౌన్సిలర్ పదవులకు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ కౌన్సిలర్లు సిద్ధమేనా అని ప్రశ్నించారు. లింగంపల్లి మధుకర్ మాట్లాడుతూ అధికార పార్టీ కౌన్సిలర్లు విలీనం వల్ల జరిగిన పరిణామాలపై ప్రజల్లో బహిరంగ చర్చకు రావాలని అన్నారు. కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో .గొట్టె అశోక్,బుర్రమల్లేశంగౌడ్,సలేంద్రి బాలరాజుయాదవ్,మంగకిరణ్,సలేంద్రి వేణు యాదవ్, గంభీరావుపేట్ ప్రశాంత్ గౌడ్,బెజ్జారపు రమేష్ గౌడ్,మాడ్దుల వంశియాదవ్, అజయ్ యాదవ్,బైరగోని పర్శరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు