ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌

మంత్రి హరీష్‌ రావుతో కలసి సందర్శించిన ఎన్నారై బృందం
సిసిఎం కెసిఆర్‌కు ప్రశంసలు
పెద్దపల్లి,మే3(జ‌నం సాక్షి):  రాష్ట్రంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి హరీష్‌ రావుతో కలిసి ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే బృందం సందర్శించింది. ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న ఆరో ప్యాకేజీ టన్నెల్‌, రిజర్వాయర్ల పనులను వాళ్లు పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎత్తిపోతల వ్యవస్థ పనిచేసే తీరును ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ ను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావు ఎంతో పట్టుదలతో ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతి రోజు రికార్డు స్థాయిలో పనులు చేస్తుండడం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సాగు నీటి, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలతో రాష్ట్రం అతి వేగంగా అభివృద్ధి పథానికి దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో తెలంగాణ తొందరలోనే బంగారు తెలంగాణగా మారతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ బృందంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షులు అనీల్‌ కూర్మాచలం, సభ్యులు అశోక్‌ దూసరి, నవీన్‌ రెడ్డి, శ్రీకాంత్‌ జెల్ల, మల్లేష్‌ పప్పుల, సత్య చిలుముల, స్థానిక తెరాస నాయకులు రాజేష్‌ ఉన్నారు.
—-