ప్రపంచనగరాలతో హైదరాబాద్‌ పోటీ

` బీజేపీ తెలంగాణకు చేసిందేమిటీ?
– రైజింగ్‌ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు
` ఎన్ని ఆటంకాలు ఎదురైన కంచ గచ్చిబౌలి అభివృద్ధి ఆగదు
` అక్కడ కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం
` ఢల్లీిలాగా హైదరాబాద్‌ను చేయదలచుకోలేదు
` నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ
` 3 లేయర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం
` రాబోయే 100 రోజుల్లో కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు ప్రణాళికలు

ప్రపంచంలోని నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్‌పై ఒత్తిడి పెరుగుతున్నందునే 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని చేపట్టాం. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలుగా మారబోతోంది. అందరికీ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం వస్తుంది.’’ – రేవంత్‌ రెడ్డి, సీఎం

హైదరాబాద్‌(జనంసాక్షి): ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని, కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.‘’ హైదరాబాద్‌ ప్రజల దాహర్తిని తీర్చేందుకు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్‌) చేసిన కృషి మరువలేనిది. ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. ఎప్పుడు పిలిచినా పలికే పేదల నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు. హైదరాబాద్‌ దోమలగూడలోని పీజేఆర్‌ ఇల్లు ఒక జనతా గ్యారేజీగా కనిపించేది. పీజేఆర్‌ కృషితోనే హైటెక్‌ సిటీ గచ్చిబౌలికి మంజూరైంది. హైటెక్‌ సిటీకి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన పునాది రాయి వేస్తే.. చంద్రబాబు దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోని నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలి. న్యూయార్క్‌, టోక్యో వంటి నగరాలతో హైదరాబాద్‌ పోటీపడుతోంది. ఎంత మంది రాక్షసులు అడ్డుపడినా మా యజ్ఞం ఆగదు. రైజింగ్‌ తెలంగాణ-2047 లక్ష్యంతో మాతో అందరూ కలిసి వస్తున్నారు.
3 లేయర్లుగా తెలంగాణ..
3 లేయర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం. రాబోయే 100 రోజుల్లో కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతాయి. కాలుష్యం కారణంగా నేడు దిల్లీలో నివసించలేని పరిస్థితి ఏర్పడిరది. దేశ రాజధానిలో నివసించలేని పరిస్థితి వచ్చిందంటే పాలకులు సరైన ప్రణాళిక లేకపోవడమే కారణం. వర్షం వస్తే చెన్నై అతాలాకుతలమవుతోంది, బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకుంటోంది. దిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. డీజిల్‌ బస్సులను నగరానికి అవతలకు పంపించే చర్యలు చేపట్టాం. నగరంలో 3వేల ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తాం. ఎలక్ట్రిక్‌ కార్లు, ఆటోలు కొంటున్న వారికి పన్ను లేకుండా చేస్తున్నాం. నాలాలు కబ్జాలకు గురవడం వల్లే నగరంలో ముంపు తీవ్రత పెరిగింది.చెరువుల్లో అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చి వేసింది. వరద నీళ్లు వెళ్లేందుకు చెరువుల్లేకుండా కొందరు కబ్జాలు చేశారు. బతుకమ్మకుంటను భారాస నాయకులు ఆక్రమించుకుంటే.. కబ్జా నుంచి విడిపించాం. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ అభివృద్ధి చేస్తే 5లక్షల ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌పై ఒత్తిడి పెరుగుతున్నందునే 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని చేపట్టాం. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలుగా మారబోతోంది. అందరికీ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం వస్తుంది’’ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
కొండాపూర్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్‌) ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పాన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఆరు వరుసలు, 24 మీటర్ల వెడల్పుతో 1.2 కి.మీ నిర్మించిన ఈ పైవంతెన అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభించింది. కొండాపూర్‌ ప్రాంతం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం, అక్కడి నుంచి కొండాపూర్‌ ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఈ ప్లైఓవర్‌ ద్వారా కలిగింది.