ప్రభుత్వ భూములకు రక్షణేది..

 
*అగ్రికల్చర్ భూమిని, ప్లాట్స్ గా అమ్మకాలు… చోద్యం చూస్తున్న అధికారులు.
*లక్ష యాభై వేలు కాజేసిన పంచాయతీ కార్మికుడు పై కేసు నమోదు చేసిన అధికారులు.
*ఈ భూమి కబ్జా చేసి పుంపు హౌస్ కూల్చిన సామగ్రి మాయం చేసిన వారిపై కేసులు పెట్టరా…?
బూర్గంపహాడ్ ఫిబ్రవరి 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్    మండలం సారపాక లో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వారి అవసరాల నిమిత్తం స్థలాల కోసం జనం ఎగబడుతున్నారు. అది ప్రభుత్వ భూమా లేక సొంత భూమా అనే ఆలోచన చేయకుండా కొనుగోలు చేస్తూ ఇబ్బందులకు గురి అవుతున్న వైనం చోటు చేసుకుంటుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎంతో ఉంది,  ఇది అధికారిక లెక్కలలో మాత్రమే, ప్రస్తుతం కనిపించే పరిస్థితి నెలకొంది. బడాబాబులు గద్దల్లా వాలిపోతూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తూ, కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. కానీ ఇన్ని జరుగుతున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడనిపరిస్థితి. సామాన్యుడు ఇల్లు కోసం వెతుక్కో వలసిన పరిస్థితి ప్రస్తుతం మండలంలో నెలకొంది. లక్ష్మీ పురం, బంజరు ప్రాంతాల్లో చెరువుల కబ్జా జరిగినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ అధికారులు రైతు వేదిక, ప్రకృతి వనంలకు పలువురు నుండి భూమి ని తీసుకొని, పక్కా భవనాలు, పార్కులు నిర్మాణము చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పోతే పారిశ్రామిక ప్రాంతమైన సారపాక మేజర్ పంచాయతీ గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 5, సర్వేనెంబర్ 264, 263, లో పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వభూమి ఉంది, కానీ అది కొందరు పెద్దలు కబ్జా చేయడం సహజం గా మారింది. ఒక పెద్దమనిషి కొల్లు చెరువు నే కబ్జా చేసి రహదారి నిర్మాణం చేసిన వైనం. కోయగూడెం, తాళ్ల గుమ్మూరు గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో లీజు పేరుతో భూకబ్జా జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సారపాక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండవలసిన గ్రామపంచాయతీ భూమి, పక్క భవనం, సుమారు40 సెంట్ల ప్రభుత్వ స్థలం స్వాహా చేసి ప్లాట్లుగా చేస్తున్నట్లు పలువురు ఆరోపణలు చేశారు. సదరు కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి మమా అనిపించారు పంచాయతీ అధికారులు. ఆ ప్రాంతంలో గత 40 సంవత్సరాల క్రితం గ్రామ  ప్రజల  త్రాగునీరు సరఫరా నిమిత్తం ఆనాటి ఇరవెండి గ్రామపంచాయతీ, ఆ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి, అందుకు సంబంధించిన భవనం, మోటర్లు ఏర్పాటు చేసి పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా జరిగేది. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం  అలాంటి సారపాక పంపు హౌస్ ను కూడా కబ్జా చేసి దర్జాగా మోటర్, పైపులైన్లు, బిల్డింగ్ కు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇతర సామాగ్రిని అమ్ముకొని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 40 సెంట్ల స్థలం అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భవనం తొలిగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి, కానీ అర్ధరాత్రి సమయంలో జేసీబీ తో పంచాయతీ పుంపు హౌస్ నేలమట్టం చేసి సామగ్రి ని దొంగిలించి న వారిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ గా కనిపించే పుంపు హౌస్ నేడు కనుమరుగు చేశారు. ముడుపులు మత్తులో పంచాయతీ అధికారులు జోగుతున్నారా…అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.              గతంలో గ్రామపంచాయతీలో లక్షాయాభై వేలు గ్రామపంచాయతీ ఫిట్టర్ తన చేతి వాటాన్ని చూపించడంతో అతనిపైఅప్పటి    ఈ ఓ కేసు పెట్టి జైలుకు పంపించినటు వంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ భూమి అందులోని మోటర్లు, తలుపులు, కిటికీలు, పైపులు పలు సామాన్లతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ప్రేమ చూపిస్తూ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వెళ్లబోసుకున్నారు. అంటే మతలబు ఏమిటి అనే అనుమానాలు వినిపిస్తు న్నాయి. వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కాని ప్రశ్న. సారపాక ప్రధాన రహదారి ప్రాంతంలో ఉన్నటువంటి, యూనాని సేవా వైద్యశాల, భవనం దానికి సంబంధించిన భూమి ప్రస్తుతం కనుమరుగయింది. అధికారులు దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు… ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా మారి ఆక్రమణదారులకు అడ్డా గా మారింది. ఇలా ఎక్కడికక్కడ  ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ పలువురిపెద్దల అండదండలు, అధికార పార్టీ అండదండలతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి ప్రాంతంలో ఉన్నటువంటి పుంపు హౌస్ మాయం చేసిన వారిపై చర్యలు చేపట్టారా…  ఇలా ఎక్కడికక్కడ  ఇష్టానుసారంగా కబ్జాదారులు గద్దల్లా వాలిపోతూ వాటిని ప్లాట్లుగా తయారు చేసుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1ఆఫ్70 యాక్టర్ ఉందా…? అని అనుమానం వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో అమ్మకాలు కొనుగోలు చేయకూడదన్న నియమాలు ఉన్న వాటిని తుంగలో తొక్కి కబ్జాదారులు వారికి అనుకూలంగా మలచుకుంటూ అధికారులను ఒత్తిడులకు గురి చేస్తూ ముడుపులు అందజేస్తూ ప్లాటు రూపంలో అమ్మ కాలు చేస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల వైఫల్యం పూర్తి స్థాయిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు కాపాడాల్సిన పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం.  అధికారులుఇకనైనా జోక్యం చేసుకుని ప్రభుత్వభూమి బూర్గంపహాడ్ మండలం లో ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి? పూర్తి వివరాలు సేకరించి వాటిని రక్షించి ప్రభుత్వ అవసరాలకు గాని, పేదవారికి గాని వాటిని వినియోగించాలని సామాన్యుడు కోరుతున్నారు. సామాన్యుడి కోరిక నెరవేరుతుందా…. లేదా… అధికారులు కబ్జాదారుల పై కొరడా ఝులిపిస్తారా… లేదా… ప్రభుత్వ భూములుకు రక్షణ కల్పిస్తారా …లేదా…పుంపు హౌస్ స్థలం ఉందా లేదా… వారి పై చర్యలు ఉంటాయా.. ?ఉండవా…?పంచాయతీ భూమి ఉందా ?లేదా..,? …వేచిచూద్దాం అంటున్న బూర్గంపహాడ్ మండల ప్రజలు…