ప్రమాదవశాత్తూ రైతు మృతి

దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ట్రాక్టర్ కింద పడి ఒక రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నార్లోనికుంట్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బైకని గొల్లరాజు (28) గురువారం రాత్రి ఎరువుల బస్తాలను ట్రాక్టర్‌లో ఇంటికి తరలించాడు. బస్తాలను కిందకి దింపిన తర్వాత ట్రాక్టర్ ఎదుట నిలుచుని, డ్రైవర్ సీట్లో కూర్చుని ఉన్న తన బావమరిది మల్లేశ్‌తో మాట్లాడుతున్నాడు. మాటల్లో పడి గేర్‌లో ఉన్న ట్రాక్టర్ క్లచ్‌ను మల్లేశ్ వదిలి వేయడంతో అకస్మాత్తుగా ట్రాక్టర్ ముందుకు దూసుకుపోయింది.

దీంతో ట్రాక్టర్ టైర్లు గొల్లరాజుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే దేవరకద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం గొల్లరాజు మృతి చెందాడని ఎస్‌ఐ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గొల్లరాజుకు భార్య సుజాత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.