ప్రైవేట్‌ డెయిరీల దోపిడీ

గద్వాల,మే16(జ‌నం సాక్షి): జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు ప్రైవేటు డెయిరీలే దిక్కుగా మారాయి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభిస్తే జిల్లాలోని వేలాది పాడి రైతులకు మేలు జరుగుతుంది. గద్వాల ప్రాంతంలో పాడి పరిశ్రమాభివృద్ధికి  విజయ పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ డెయిరీల పోటీనీ తట్టుకోలేక  మూసివేశారు. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం మూతపడిన డెయిరీలను తెరచి, తిరిగి రైతుల నుంచి పాలు సేకరించేందుకు సమాయత్తమైంది. 
ఇందులో భాగంగా గద్వాలలోని శీతలీకరణ కేంద్రాన్ని ఏడాది  మరమ్మతులు చేశారు. గతేడాది జూన్‌లో ప్రారంభిస్తామన్న అధికారులు యంత్రాలు పూర్తిస్థాయిలో రాలేదని ఆ విషయాన్నే పక్కనపెట్టారు. కాలక్రమేణా పాలు రావటం తగ్గడంతో పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య 1998లో పాల శీతలీకరణ కేంద్రాన్ని మహిళా సమాఖ్యకు అప్పగించారు. ప్రైవేటు డెయిరీల పోటీనీ తట్టుకోలేక వారు కూడా పక్కకు తప్పుకోవడంతో కేంద్రం మూతబడింది. అప్పటి నుంచి పాడిరైతులు ప్రైవేట్‌ డెయిరీల పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. కూలింగ్‌, టెస్టింగ్‌ యంత్రాలు రాకపోవడంతో ప్రారంభోత్సవం అటకెక్కింది. అయిదు ఎకరాల విలువైన స్థలంలో ఉన్న పాలకేంద్రం భవనానికి రక్షణ కరవైంది. మందుబాబులకు అడ్డాగా మారింది. విజయ డెయిరీ సేకరణ లేకపోవటంతో ప్రైవేటు డైయిరీల వాళ్లు ఎంతిస్తే అంతే తీసుకోవాల్సి వస్తోంది.  విజయ పాల శీతలీకరణ కేంద్రం మూతపడటంతో జిల్లాలో ఆరు ప్రైవేటు డెయిరీలు రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. కొందరు రైతులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయ డెయిరీ ఎక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఇక్కడ కూడా సేకరణ చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్‌ డెయిరీల నుంచి పోటీ ఉన్నా విజయ పాలకేంద్రానికి పాలు ఇచ్చే రైతులకు చాలా ప్రోత్సాహకాలు అందిస్తామని అధికారులు అంటున్నారు.
……………………..