బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి
` మృతులంతా ఒకే కుటుంబానికి
ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిని హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన రాకేశ్‌, వినోద్‌, మదన్‌, రుతిక్‌, భరత్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆదివారం ఉదయం 18 మంది కుటుంబ సభ్యులు బాసరకు వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈక్రమంలో అయిదుగురు నీటమునిగి మృతి చెందారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు. సీఐ మల్లేశ్‌, ఎస్సై శ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.