బిందు సేద్యం కింద రాయితీ పరికరాలు

 

ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి): జిల్లాకు బిందు, తుంపర్ల సేద్యం కింద లక్ష్యం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం అర్హులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇందుకోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోగా వారికి అవసరమైన పరికరాలను అందించారు. పండ్ల తోటలు, మిరప, మొక్కజొన్న, చెరకు, పామాయిల్‌ తోటలు, కూరగాయలు, పూలతోటలు, పెంచే రైతులకు తెలంగాణ సూక్ష్మసేద్యం పథకంలో 80 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీపై బిందు సేద్యం పరికరాలను, 75 శాతం రాయితీపై తుంపర్ల సేద్యం పరికరాలను సరఫరా చేస్తారు. రైతుల పొలంలో బోరు, లేదా బావి ఉండి విద్యుత్తు కనెక్షన్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90శాతం, ఇతర రైతులకు 80 శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలిస్తారు. తుంపర్ల సేద్యం అయితే అన్ని తరగతుల రైతులకు 75 శాతం రాయితీపై ఒక హెక్టారు వరకు పరికరాలు మంజూరు చేస్తారు. ఉద్యానశాఖ, తెలంగాణ సూక్ష్మసేద్యం పథకం కింద ఖమ్మం జిల్లాకు 2016-17 సంవత్సరంలో వచ్చే రెండు నెలలకు గానూ రూ.7.69 కోట్ల లక్ష్యాన్ని కేటాయించారు. వీటిలో బిందు సేద్యానికి 906 హెక్టార్లు, తుంపర్ల సేద్యానికి 95 హెక్టార్లు కలిపి మొత్తం 1001 హెక్టార్లను మంజూరు చేశారు.