బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ – ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ
– ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ
నిర్మల్ జిల్లా జనం సాక్షి బైంసా రూరల్ నవంబర్ 19
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు పవార్ రామారావు పటేల్ శనివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి డిసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా.. ఆయన బిజెపిలో చేరాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆహ్వానించారు. ఎంపీ సోయం ఆహ్వానం మేరకు ఆయన శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ జిల్లా రాజకీయాలపై వారిద్దరు చర్చించారు. బిజెపిలో చేరాలని బండి సంజయ్ కోరగా.. ఇందుకు రామారావు పటేల్ సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డా, ఇతర కీలక నేతలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28న పవార్ బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 28 నుంచి 5వ విడత ప్రజా ప్రస్థాన యాత్ర బైంసా నుంచి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. అదే రోజున బైంసాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర జాతీయ నాయకుల సమక్షంలో రామారావు పటేల్ తన అనుచర జనంతో బిజెపిలో చేరనున్నారు. పవర్ బిజెపిలో చేరిక బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఉపాధ్యక్షులు, నిర్మల్ జిల్లా ఇన్చార్జి, ప్రజాప్రస్థాన యాత్ర ఇన్చార్జి గంగిడి మనోహర్ రెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, ఐ కార్ సభ్యులు గోనె శ్యాంసుందర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు రవి పాండే, బిజెపి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సార్వతో చర్చించారు. ఈ నెల 28న బైంసాలో భారీ బహిరంగ సభ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోగా.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి చర్చించారు. రామారావు పటేల్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో బిజెపిలో చేరుతుండడంతో.. ముధోల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ కానుంది.