భద్రాద్రిలో మార్గశిర ఉత్సవాలు ప్రారంభం
భద్రాచలం,నవంబర్27 (జనంసాక్షి ) : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. అదేవిధంగా రంగనాథస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈనెల 28వ తేదీ గురువారం తాతగుడి సెంటర్లో వేంచేసి ఉన్న గోవిందరాజస్వామివారికి పంచామృ తాభిషేకం, 29వ తేదీ శుక్రవారం సందర్భంగా స్వర్ణ కవచాలంకరణ, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం, మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు బీపీఎల్ భక్తబృందంచే లక్ష్మీఅష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5గంటలకు ఆరాధన, సంధ్యాహారతులు, రాత్రి 7గంటలకు దర్భార్సేవ, 8 గంటలకు చుట్టుసేవ, 9గంటలకు పవళింపు సేవ నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్బాబు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. డిసెంబర్2వ తేదీ రాజా తూము నర్సింహదాసు జయంతి ఉత్సవాలు ప్రారంభమవు తాయని వెల్లడించారు. డిసెంబర్ 6నుంచి 10వరకు అంతరాలయంలో తిరుమంగైళ్వార్ తిరునక్షత్రోత్సవాలు, 8వ తేదీ గీతా జయంతి, శ్రీవైష్ణవ ఏకాదశి, 11వ తేదీ తిరుప్పాణ్యాళ్వార్ తిరునక్షత్రోత్సవం, 12వ తేదీ కృత్తికా దీపోత్సవం సందర్భంగా సాయంత్రం అంకురారోపణ యాగశాలలో నిర్వహించబడునని పేర్కొన్నారు. 16వ తేదీ రాత్రి 11.54నిమిషాలకు ధనుసంక్రమణ ప్రవేశం, 17వ తేదీ ఉదయం తెల్లవారుజామున 4గంటలకు తెరిచి 5గంటల వరకు ఆరాధన నిర్వహిస్తారు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులను కండన్, ఆండాల్ అమ్మవారిని వేంచేయింప చేసి అభిషేకం నిర్వహిస్తారు. 5నుంచి 6గంటల వరకు తిరుప్పావై 30 పాశురాలు విన్నపం చేసిన పిదప, 7నుంచి 8.30నిమిషాలకు అమ్మవారిని తాతగుడిసెంటర్ వరకు తిరువీధిసేవ గావిస్తారు. 26వ తేదీ సూర్యగ్రహణం సందర్భంగా 25వ తేదీ రాత్రి ఆలయ తలుపులు మూసివేసి 26వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శాంతి ¬మాలు నిర్వహించి, సాయంత్రం 3.30నిమిషాలకు భక్తులకు సర్వదర్శనం కల్పించబడునని తెలిపారు.