భద్రాద్రి వద్ద గోదవారికి జలకళ

సీతమ్మసాగర్‌ కాపర్‌డ్యాం మునక
భద్రాచలం,జూలై7(జనంసాక్షి ):ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద సీతమ్మసాగర్‌ బ్యారేజ్‌కు సంబంధించిన కాపర్‌డ్యాంపై నుంచి వరద పారుతుండటంతో బ్యారేజ్‌పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న సీతమ్మ బ్యారేజ్‌ మొదటి కాపర్‌డ్యాం నీటమునిగింది. దీంతో బ్యారేజ్‌ పనులు నిలిచి పోయాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి యంత్రాలను, ఇతర సామగ్రిని బయటకు తరలించారు. అలాగే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి కొత్తనీరు వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరి ఈ సీజన్‌లో తొలిసారి జలకళను సంతరించుకుంది. గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రం 6గంటలకు 15అడుగులకు చేరుకుంది. గోదావరికి కొత్తనీరు వచ్చి చేరడంతో భక్తులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎగువనున్న మర్కోడు, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతుండగా.. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయ నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. కిన్నెరసాని కాలువ పరిసరాల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ మోటార్లను సురక్షితమైన ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. కొద్ది రోజుల క్రితం ఆకేరులో చెక్‌ డ్యాంను పూర్తిచేశారు. దీనికి కూడా వరదనీరు పొంగుతోంది.ఏళ్లనాటి సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది.