భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ పరిధిలోని బోడబండ్లగూడెంలో భర్త భార్యను రోకలిబండతో కొట్టిచంపిన సంఘటన సోమవారం జరిగింది. సూర్యాపేట సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాంపెల్లి సంగయ్య తన భార్య సుజాత(27)ను రోకలిబండతో తీవ్రంగా కొట్టి చంపాడు. పని చేయకుండా జులాయిగా తిరిగే సంగయ్య మూడు రోజులుగా తరుచూ భార్యతో గొడవపడుతున్నట్లు తెలిపారు. సోమవారం కూడా ఘర్షణ జరగడంతో సంగయ్య కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాధితురాలు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా వెంబండించి రోకలిబండతో తలపై మోదాడు. సుజాత అక్కడికక్కడే మృతి చెందింది. పెన్‌పహాడ్‌ మండలం అనంతరం గ్రామానికి చెందిన సుజాతకు సంగయ్యతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడో తరగతి చదివే ఎఎనిమిదేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. ఈ హృదయవిదారకమైన సంఘటనతో చిన్నారులను చూసి స్థానికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.