మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి):మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. స్టేషన్ల పరిధిలోని గొత్తికోయ ప్రాంతాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యల గురించి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అధికారులంతా కృషి చేయాలని తెలియజేశారు.ఏజెన్సీ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తమ తమ పోలీస్‌ స్టేషన్లకు అవసరమైన రక్షణకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు అన్ని విభాగాల్లో ప్రోత్సాహం అందించాలని కోరారు. జిల్లాలోని ఏజెన్సీ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులకు ఆయన సూచనలు చేశారు. అలాగే సంఘవిద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్రోహశక్తుల సమాచారం సేకరించేవిషయంలో చాకచక్యంగా వ్యవహరించాలన్నారు.