ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌దే

 

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెదేపాలు ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా మోసం చేశాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ విమర్శించారు. కేవలం టిఆర్‌ఎస్‌ మాత్రమే వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముస్లిం మైనార్టీలకు తెరాస ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తుందని హావిూ ఇచ్చారు. షాషాగుట్ట దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌, తెదేపాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పి.. తెరాస ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.