మొదటి సారిగా మొబైల్‌ బుక్‌ కీపింగ్‌

ఖమ్మం, జూలై 15 : రాష్ట్రంలో ఇందిర క్రాంతి పథకంలో ఎలక్ట్రానిక్‌ మొబైల్‌ బుక్‌కీపింగ్‌ ప్రవేశప్టెటడం దేశంలోనే మొట్టమొ దటిసారి అని షర్ఫ్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను రవిశంకర్‌, రమేష్‌, రవీంధ్రనాథ్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదని అన్నారు. మొబైల్‌ బుక్‌ కీపింగ్‌లో భాగంగా ప్రత్యేక సాప్ట్‌వేర్‌ నిక్షిప్తం చేసినా సెల్‌ఫోన్‌లో మహిళా సంఘాలు పూర్తి కార్యక్రమాలు నిర్వహించవచ్చునన్నారు. రాష్ట్రంలోని మహిళలు మొబైల్‌ బుక్‌కీపింగ్‌ అమలులో ముందున్నారని, జిల్లాలో ఆశాజనకంగా ఇది అమలవుతుందని వారు అభినందించారు. ఖమ్మం జిల్లాలో మొబైల్‌ బుక్‌కీపింగ్‌ ద్వారా 62 శాతం వివరాలు నమోదు పూర్తయిందన్నారు. మొబైల్‌ బుక్‌కీపింగ్‌ అమలులో లోటుపాట్ల అమలు తీరు సెల్‌ సిగ్నల్‌, సాంకేతిక సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాలో పర్యటిస్తున్నామని వారు అన్నారు. రాష్ట్ర ఐకేపిలో విప్లవాత్మకంగా అమలు చేస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్‌ బుక్‌ కీపింగ్‌ ద్వారా బ్యాంకర్లు, ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు సంఘాల పనితీరును తెలుసుకునే వేసులుబాటు ఉందని వివరించారు.