మోదీ సర్కారుది మాటల గారడీ
– కుంభకోణాల్లో కూరుకుపోయింది
– బీహార్ ఎన్నికల సభలో సోనియా ఫైర్
న్యూఢిల్లీఆగస్టు 30, (జనంసాక్షి) తమ పోరాటం ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టం సవరణ బిల్లు విషయంలో వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. అందుకే మరోసారి దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చుకుందని విమర్శించారు. ఆదివారం పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల అంచనాలను చేరుకోలేకపోయిందని అన్నారు. చెప్పడం తప్పా ఏం చేయలేకపోతున్నారని, ప్రదర్శనకారులుగా మిగిలారని వ్యాఖ్యానించింది. బీహార్లో ఆయన కార్యకలాపాలు చూస్తుంటే ఇప్పుడు ఆ రాష్ట్రం, అక్కడి ప్రజలపై కారు చీకట్లు
అలుముకున్నట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. దేశ రక్షణ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయిందని అన్నారు. పాకిస్థాన్కు గట్టి బదులు ఎందుకు
ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రతి రోజూ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో పలువురు ప్రజలు, వీర జవాన్లు పాకిస్థాన్ దుశ్చర్యలవల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఈ విషయాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవడం లేదని నిలదీశారు.