భూభారతితో కర్షకుల కన్నీళ్లు తడిచాం

` దొరలకు చుట్టంలా ధరణి
` బీఆర్‌ఎస్‌ ఓటమికి ఆ చట్టమే కారణం
` గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో దొరికేవి
` మా ప్రభుత్వం రాగానే ప్రక్షాళన చేశాం
` ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
` త్వరలోనే గ్రూప్‌-3, గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలు
` సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారు
` సర్వేయర్లులకు లైసెన్స్‌లు పంపిణీ చేసిన సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం.. కొంతమంది దొరలకు చుట్టంగా మారిందన్నారు. ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూమి మీద అధిపత్యం చెలాయించాలని చూశారన్నారు. ‘‘ మా గెలుపునకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, భారత రాష్ట్ర సమితి ఓటమికి ధరణి చట్టమే కారణం. అధికారంలోకి వస్తే ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని తొలగించి భూ భారతి తీసుకొచ్చాం. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చినా పరీక్షలు పెట్టలేదు. ఒకవేళ పరీక్షలు పెట్టినా ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో దొరికేవి. గత ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ పునరావస కేంద్రంగా ఉండేది. మా ప్రభుత్వం రాగానే ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టులో కేసులు వేసి అపాలని చూస్తున్నారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నాం. త్వరలోనే గ్రూప్‌-3, గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తాం. లైసెన్స్‌ పొందిన సర్వేయర్లంతా బాధ్యతా యుతంగా వ్యవహరించి, రైతులకు సాయం చేయాలి’’ అని రేవంత్‌ అన్నారు.