రసాయనాల పొగ కన్నా దోమతెరలు మిన్న
– వైద్యాధికారి వెంకటప్రకాష్
జనంసాక్షి (జూలై 11) : వర్షాకాలంలో దోమల నివారణ కోసం చాలామంది రసాయనాల పొగను ఉపయోగిస్తుంటారు వాటి కంటే దోమతెరలు వాడకం ఉత్తమైనదని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి వెంకట ప్రకాశ్ అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన జనం సాక్షి తో మాట్లాడారు. పలు సలహాలు సూచనలు చేశారు. ప్రమాదకర దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలుతాయని వాటిని నివారించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలం అన్నారు. పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు మురికి నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా వంటి వ్యాధులు రావన్నారు. సహజంగా వర్షాకాలంలో జ్వరాలు వస్తుంటాయని ప్రజలు అధైర్యపడకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలన్నారు. జలుబు దగ్గు వంటి లక్షణాలతో వస్తే ముందుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి అనంతరం జ్వరాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణం ప్రభుత్వ ఆస్పత్రికి రావాలని కోరారు