“రానున్నది రామరాజ్యమే – బిజెపి నేత బొబ్బనవతారెడ్డి”

:శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 25( జనంసాక్షి): రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా,ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టినా భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేసేదిలేదని, రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, రామరాజ్య స్థాపన జరుగుతుందని బిజెపి నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి జోస్యం చెప్పారు. ఈ మేరకు గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రవల్ల భాజపా కు లభిస్తున్న ప్రజాధరణ వల్ల తెరాస పార్టీలో, ఇతర విపక్షాలలో గుబులు మొదలైందని, అందుకే దిక్కులేని పరిస్థితుల్లో బండి సంజయ్ పాదయాత్రని అడ్డుకోవడంతోపాటు సిగ్గు లేకుండా మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. గులాబీ దండు రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని అది చాలదు అన్నట్టుగా ఇప్పుడు దేశం పైన పడ్డారని, కెసిఆర్ కుమార్తె కవిత లిక్కర్ డాన్ గా మారుతుందని, ఇది రాష్ట్ర సంక్షేమానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు. తెరాస కుంభకోణాలు, అక్రమాలు, అడ్డగోలు బాగోతాలు బట్టబయలవుతున్నాయన్న అక్కస్సుతో లేని కుట్రలకు తెరలేపి నేడు హైదరాబాదులో శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కెసిఆర్ కంపెనీ తెలంగాణ ప్రజలవద్ద వంగి సలాము చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఓట్లేసి ఆదరిస్తారని టిఆర్ఎస్ భావిస్తే అర్ధగంట అత్యాశ మరొకటి ఉండదని నవతారెడ్డి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.