రైతుబంధు దేశానికే ఆదర్శం
సిఎం కెసిఆర్ది విప్లవాత్మక నిర్ణయం: ఎంపి కవిత
జగిత్యాల,మే10(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలోచన జరగలేదన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని అన్నారు. ప్రజాహిత కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. ప్రజల బతుకులు మార్చుకోవడమే లక్ష్యంగా తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గుల్లపేటలో ఎంపీ కవిత రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ విప్లవాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు చొప్పున పంట పెట్టుబడి ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతకుముందు జగిత్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
—————-