రైతుబీమాతో కుటుంబాలకు ఆసరా

రైతుబంధు బాండ్లను అందచేసిన పోచారం

రంగారెడ్డి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుకు ప్రీమియం చెల్లించి.. బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణెళి అని పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలో రైతుబంధు జీవిత బీమా ధృవీకరణ పత్రాలను మంత్రి పోచారం రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 14 రాత్రి నుంచి రైతుబంధు జీవితబీమా అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు వర్తిస్తుంది. కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ కుటుంబానికి ఆసరాగా రూ. 5 లక్షల బీమా అందుతుంది. రైతు చనిపోయిన పది రోజులలోనే నామినీకి రూ. 5 లక్షల చెక్కు అందుతుంది. ఈ రూ. 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకున్నా 8 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 40,000 లభిస్తుంది. కుటుంబాన్ని పోషించే రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఈ డబ్బులతో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బతుకుతుంది. రైతుబంధు పథకం నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్‌ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు, కోటి యాబై లక్షల ఎకరాలకు, ఎకరాకు రూ. 8,000 చొప్పున మొత్తం రూ. 12,000 కోట్లను అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడకూడదనే మంచి ఉద్యేశంతో రాష్ట్రంలో రైతుబంధు జీవిత బీమా అమలు చేస్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 2,271 చొప్పున మొత్తం 636 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ సంస్థకు చెల్లించడం జరిగిందని చెప్పారు.

ఇప్పటికే వేరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లాలో 2,42,000 మంది రైతులకు గాను 1,89,000 మంది రైతులను వ్యవసాయ శాఖ అధికారులు కలిసి వివరాలను సేకరించారు. వెనుకబడిన షాద్‌ నగర్‌ ప్రాంతంలో సూక్ష్మ బిందు సేద్యానికి ఆధిక ప్రాధాన్యత ఇస్తాం. అవసరమైనన్ని యూనిట్లను అందజేస్తామని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. షాద్‌ నగర్‌ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్‌, రైతులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.