రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన చుండూరు రమేష్‌బాబు (29) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా నల్గొండ సమీపంలో బంధువులతో ఫోన్‌లో మాట్లాడాడు. 7:30గంటల వరకు నడికుడి చేరుకొని తొమ్మిదిన్నరకు ఇంటికి చేరతానని చెప్పాడు. దామచర్ల మండలం విష్ణుపురం గ్రామ సమీపంలో 136మైలురాయి వద్ద ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు రైల్వే ఇంచార్జి ఎస్సై వి.వేణు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.