రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ztm6zxzoనల్గొండ : మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లో భాజా భజంత్రీలు మోగాలి. కానీ… విధి వక్రీకరించి ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సి వచ్చింది. ‘మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు’ అనడానికి ప్రస్తుతం జరిగిన ఈ ఘటనే ఉదాహారణ. అక్క పెళ్లి పత్రికలు పంచేందుకు ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి మోటార్ సైకిల్‌పై బయలుదేరగా… గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందుకు సంబంధించించిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామానికి చెందిన మాడవత్ సాయికుమార్ అనే యువకుడు తన అక్క పెళ్లికి సంబంధించిన పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. అయితే… పాపం అతనికి అదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదేమో. తుర్కపల్లి మండలం పెద్దతండా వద్దకు చేరుకోగానే మెదక్ జిల్లా గజ్వేల్ వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా మోటార్ సైకిల్‌ను ఢీకొంది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాల వద్ద పెళ్లి పత్రికలు చెల్లాచెదురుగా రక్తపు మరకలతో ఉండటాన్ని చూసిన పలువురు ‘అయ్యోపాపం’ అంటూ కంటతడిపెట్టారు. కాగా… మోటార్ సైకిల్ ను ఢీకొన్న లారీ మాత్రం ఆపకుండానే వేగంగా వెళ్లిపోయింది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.