వరేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వరంగల్‌లో ఇద్దరు, జీడిమెట్లలో ఒకరు మృత్యువాత
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్‌` ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది.
ఖిలా వరంగల్‌ మండలం మామునూరు శివారులో వాగ్దేవి ఇంజినీరింగ్‌ కాలేజీ వైపు నుంచి వరంగల్‌ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు వరంగల్‌ శివనగర్‌, కాశిబుగ్గకు చెందిన పోలేపాక వినయ్‌(27), చిన్నపల్లి ప్రదీప్‌(17) గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఇకపోతే హైదరాబాద్‌ నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సెక్యురిటీగా పని చేసే సుందర్‌ రావ్‌(58) దూలపల్లి కమాన్‌ వద్ద సైకిల్‌తో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ సుందర్‌ రావు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో సుందర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ లారీని వదిలేసి పరారయ్యాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.