వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన

వర్షాకాలం వ్యాధులు రాకుండా కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సింగరేణి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, ఆర్కేపి ఏరియా హాస్పిటల్ డాక్టర్ పల్లె లోకనాథ్ రెడ్డి ఆర్కే పీ సివిల్ డిపార్ట్మెంట్లోని పనిచేస్తున్న కార్మికులకు శనివారం అవగాహన కల్పిస్తూ, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వర్షాకాలం త్రాగునీరు కలుషితం కావడం వల్ల ఎక్కువగా వాంతులు, విరోచనాలు, డనేరియా లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని, మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏదైనా ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, మనం త్రాగే మంచినీరును వేడి చేసి కాచి చల్లార్చి వడగట్టుకుని తాగాలని అన్నారు. ముఖ్యంగా వర్షం నీరు ఎప్పటికప్పుడు పూల కుండీలలో, కూలర్లలో నీటిని నిల్వ ఉంచకుండా పారపోస్తూ ఉండాలని, వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా తయారై మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మన ఇంటికి దోమలు రాకుండా తలుపులకు, కిటికీలకు జాలి ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మన శరీరానికి వోడామస్ లాంటి ఆయింట్మెంట్ రాసుకోవాలని, అదేవిధంగా మంచం చుట్టూ దోమతెరలు కట్టుకోవాలని సూచించారు. ఎవరికైనా వాంతులు, విరేచనాలు, జ్వరం లాంటివి వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఎస్.ఈ. రవికుమార్, సీనియర్ సూపర్వైజర్ రబ్బా శ్రీనివాస్, సూపర్వైజర్ సమ్రాన్, హెల్త్ ఎడ్యుకేటర్ కల్వల రామ్మోహన్ లు పాల్గొన్నారు.