వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు
పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు
కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ లోడ్‌తో వెలుతున్న వాహనాల కారణంగా బీ హైదరాబాద్‌- మెదక్‌- ఎల్లారెడ్డి- బాన్సువాడ బోధన్‌ రాష్ట్ర ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. చాలా చోట్ల మోకాలు లోతు గుంతలు పడి ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ రహదారిపై వాహనాల యజమానులు ప్రయాణించాలంటేనే జంకిపోతున్నారు. ఇక ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ రహదారిపై ఎల్లారెడ్డి పట్టణ శివారు నుంచి మొదలుకొని మెదక్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండల కేంద్రం వరకు రోడ్డు చాలా వరకు ధ్వంసమైంది.
అయినా సంబంధిత అధికారులు మాత్రం తమకేవిూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపట్ల వాహనాల
యజమానులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవ హరిస్తున్నారని మండిపడుతున్నారు. కొంతమంది వాహన దారులు చేసేదేవిూ లేక ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్‌కు ఇదివరకు మెదక్‌ నుంచి వెళ్లేవారు. కానీ ఇప్పుడు కామారెడ్డికి వెళ్లి అక్కడ్నుంచి హైదరాబాద్‌కు వెలుతున్నారు.  ఈ రహదారి చాలా వరకు పూర్తిగా ధ్వంసం కావడంతో నూతన బీటీ రహదారిని ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు డిమాండ్‌ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి మెదక్‌ జిల్లా కేంద్రం వరకు సరిగ్గా 40 కిలోవిూటర్ల దూరం.. ఈ రెండు జిల్లాల మధ్య ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. ఈ రహదారిపై ఓవైపు వాహనాలు చెడి పోతుండగా, మరోవైపు భారీగా ఏర్పడిన గుంతలతో ఒళ్లంతా హూనమవుతోందని వారు వాపోతున్నారు.  కనీసం మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదని తలలు పట్టుకుంటున్నారు.  కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని పలు రహదారులు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రహదారులపై తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చెయాల్సి వచ్చి, ఈ గతుకుల రహదారిపై అవ స్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డికి ఒకవైపు అంటే ఎల్లారెడ్డి నుంచి బొగ్గు గడిసె వరకు పూర్తి స్థాయిలో రహదారి ధ్వంసం కావగా, మరోవైపు ఎల్లారెడ్డి శివారులోని ఎంపీడీవో కార్యాలయం నుంచి మెదక్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు హెచ్‌ఎంబీ ప్రధాన రహదారి చాలవరకు ద్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ గుంతలు ఏర్పడడంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని, వాహనాల పార్టులు ఊడిపో తున్నాయని, టైర్లు పగిలిపోవడం, పంక్చర్‌లు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్వంసమైన రహదారితో పాటు స్పీడు బ్రేకర్లు కూడ ఈ రూట్లో అధికంగా ఉండడంతో ప్రయాణం మరింత ఇబ్బందిగా మారింది. ప్రయాణీకులకు ఇంత ఇబ్బందిగా మారిన ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైనా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం తమకేవిూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.