వికలాంగ విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ చేయూత

ఖమ్మం, జూలై 17 : జిల్లాలోని వికలాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా చేయూత అందిస్తున్నట్లు రాజీవ్‌ విద్యామిషన్‌ పిఓ వేణయ్య తెలిపారు. జిల్లాలో ఖమ్మంతో పాటు భద్రాచలంలో వికలాంగ విద్యార్థులకు ప్రతి శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 20 మంది ఫిజియో థెరఫీస్టులతో ప్రత్యేక ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. దీంతో పాటు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చొరవతో ఖమ్మం స్థానిక ఆసుపత్రిలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా గ్రహణంమొర్రి, కొండనాలిక చీలికకు శస్త్ర చికిత్స ఉచితంగా చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 21 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు జిల్లాలో ఏర్పాటు చేశామని తెలిపారు.