విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్కింపు

ఖమ్మం,మే22(జ‌నంసాక్షి): విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్‌ కర్ణన్‌ అన్నారు. రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకులు మినహా వేరెవ్వరూ మొబైల్‌ ఫోన్లు లోనికి తీసుకురాకూడదన్నారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొదట పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కిస్తారని, ఆ తర్వాత ఈవీఎంలు లెక్కిస్తారని తెలిపారు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో 1,798 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసి రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఓట్లు లెక్కించేందుకు అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ అబ్జర్వర్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరచి ఈవీఎంలు బయటకు తీసుకొస్తామని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు.  కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్లు లెక్కింపుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన సువిధ వెబ్‌ సర్వీస్‌పై ఆర్వో లాగిన్‌, ఏఆర్వో లాగిన్‌ పక్రియ గురించి వివరించారు. అభ్యర్థులు, ఏజెంట్లు గురువారం ఉదయం నిర్ణీత సమయానికి ఓట్లు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలన్నారు.