విశ్వేశ్వర్‌ రెడ్డివి మతిలేని మాటలు!


– తెరాస ఎంపీ జితేందర్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : పార్టీని వీడిని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  మంత్రి మహేందర్‌ రెడ్డితో విభేదాలు ఉండటం వల్లే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెరాసను వీడారని అన్నారు. తనకు రాజకీయం సరిగా రాదని ఆయన తన రాజీనామా లేఖలోనే పేర్కొన్నారని, సీఎంను, ఆయన సేవలను లేఖలో పేర్కొన్నారని చెప్పారు. కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు నడుచుకోవడం తమ బాధ్యత అన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మతి కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను, కేకే అసంతృప్తితో ఉన్నామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తమను ఎంపీలుగా గెలిపించి.. పార్లమెంటరీ నాయకులుగా గొప్ప బాధ్యతలు తమకు కేసీఆర్‌ అప్పగించారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడమన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని అన్నారు. ప్రజలంతా కూటమికి ఓటుద్వారా బుద్దిచెప్పి మరోసారి కేసీఆర్‌ పాలనకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.