షాద్‌నగర్‌ స్కూల్‌ బస్సులో పొగలు

షాద్‌నగర్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌లోని బాబా దాబా వద్ద నారాయణ పాఠశాలకు చెందిన బస్సులో పొగలు వచ్చాయి. విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించడంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాయికల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల నుంచి విద్యార్థులను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు తీసుకెళ్లేందుకు స్కూల్‌ బస్సు వచ్చింది. తిరుగు ప్రయాణంలో టోల్‌ ప్లాజా సమీపానికి చేరుకొనేసరికి బస్సులో ఆకస్మాత్తుగా పొగలు రావడంతో డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు ఆపేశారు. సమీప గ్రామాల ప్రజలు బస్సు అద్దాలను పగలగొట్టి విద్యార్థులను సురక్షితంగా కిందికి దించేశారు. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం కొంత కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.