సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలి: బిజెపి 

మహబూబ్‌నగర్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  అవినీతి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాన మంత్రి మోడీ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థాను సరిదిద్దేందుకు సహాకరించాల్సిన ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి పూర్తిస్థాయి ప్రయోజనాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలన్నారు. పార్టీలో పని చేసే ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తేనే పార్టీ మరింత పటిష్ఠంగా రూపుదిద్దుకొంటుందని  పిలుపునిచ్చారు.  రానున్న ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా పార్టీ యంత్రాంగాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు.