సడక్‌బంద్‌ శాంతియుత పోరాటమే

అరెస్టులతో రెచ్చగొట్టొద్దు ప్లీజ్‌
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
సడక్‌బంద్‌ శాంతియుత పోరాటమేనని అరెస్టులతో ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొట్టొద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం జిల్లాలోని బూత్‌పూర్‌లో ఈనెల 24న నిర్వహించనున్న సడక్‌బంద్‌ విజయవంతం చేయాలనే పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా ఒక భారీ కార్యక్రమానికి వేదిక అవుతుందని అన్నారు. ఇది జేఏసీకి గొప్ప విజయమని పేర్కొన్నారు. బంద్‌లో పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఎన్నిక ఎత్తులు వేసినా తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరన్నారు. సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణవాదులపై పోలీసులతో బైండోవర్‌ కేసులను పెట్టిస్తున్నారని ఇది అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న బైండోవర్‌ కేసులతో తెలంగాణ ప్రజల్లో ఐక్యత వచ్చిందన్నారు. బైండోవర్లకు తెలంగాణ ప్రజలు భయపడొద్దని సూచించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పిన గులాంనబీ ఆజాద్‌పై ఎందుకు బైండోవర్‌ కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 24న జరిగే  సడక్‌ బంద్‌ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని మహబూబ్‌నగర్‌ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. టీ జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో కలిసి కోదండరామ్‌ ఎస్పీని కలిశారు. ఉద్యమకారులను అడ్డుకోవద్దని ఈ కార్యక్రమంపై విధించిన ఆంక్షలను సడలించాలని వారు ఎస్పీ కోరారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తకోట, అడ్డాకుల తదితర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. 24న బంద్‌కు సన్నాహాక చర్యలు చేస్తుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. దీనిపై ఆందోళన చెలరేగడంతో వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

తాజావార్తలు