సర్వాంగ సుందరంగగా ట్యాంక్‌బండ్‌

దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు
హైదరాబాద్‌,మే31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. జూన్‌ 2న ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది అవతరణ దినోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రావిూణ కళారూపాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర అధికారిక గీతం ‘జయజయహే తెలంగాణ‘పై పోలీసు సిబ్బంది ప్రదర్శన చేపడతారు. ఉత్సవాలకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రతువులో రహదారులు, భవనాలు, బల్దియా, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్తు, పర్యాటక, సమాచార, అగ్నిమాపక, పోలీసు తదితర శాఖలు నిమగ్నమయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.