21 శాతాబ్దం భారత్‌దే

C

– కాలిఫోర్నియాలో ప్రవాస భారతీయుల సభలో మోదీ

న్యూయార్క్‌,సెప్టెంబర్‌28(జనంసాక్షి):  ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారత్‌ పట్ల ఆశ, నమ్మకంతో చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. 21 శతాబ్దం ఆసియా ఖండానిదేనని , మరి చెప్పలంటే 125 కోట్ల భారతీయులదేననీ . ఈ మార్పు ఒక్క మోదీ వల్లే వచ్చినది కాదన్నారు. ప్రపంచం భారతదేశాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని శాప్‌ సెంటర్‌లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌ జన్మదినం నాడు ప్రవాస భారతీయులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిగా తనకు ఇది రెండోసారి అమెరికా పర్యటన అని మోదీ తెలిపారు. గతేడాది పర్యటనలో మాడిసన్‌ స్వ్కేర్‌లో భారతీయులను కలిశానని.. ఏడాది తర్వాత కాలిఫోర్నియాలో ప్రవాసులను కలిశానని అన్నారు. అమెరికా ప్రజలు భారతీయుల పట్ల గౌరవం చూపుతారని పేర్కొన్నారు. భారతీయుల చేతివేళ్లు కంప్యూటర్‌ కీబోర్డుపై మ్యాజిక్‌ సృష్టిస్తున్నందువల్లే భారత్‌కు గ్లోబల్‌ గుర్తింపు వచ్చిందన్నారు. భారతీయులు మేధో సంపత్తితో ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నారని కొనియాడారు. మేధో వలస మేధో సంపదగా మారుతోందన్నారు. గోపాల్‌ ముఖర్జీ 1940లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో చదివిన మొట్టమొదటి భారతీయుడని, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ కాలిఫోర్నియాలో చదువుకున్నారని మోదీ తెలిపారు. తన దేహం దేశం కోసమేనని… దేశం కోసం జీవిస్తా.. దేశం కోసం మరణిస్తానని మోదీ స్పష్టం చేశారు. దేశం కోసం చేసే పనిలో ఎలాంటి ప్రయత్నం లోపం ఉండదన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హావిూలు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామన్నారు. మన దేశంలో 65శాతం మంది యువకులేనని.. శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. పేదరికం లాంటి అనేక సమస్యలున్నా… దేశం ప్రగతిబాటలో ముందుకెళుతుందన్నారు.

అంతరిక్ష సేవల్లో మేటి

భారత్‌ అంతరిక్ష సేవల్లో అగ్రస్థానానికి పోటీ పడుతోందని మోదీ అన్నారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి భారతీయులు ఎదిగారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని విధంగా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన మామ్‌ తొలి ప్రయత్నంలోనే విజయవంతమైందన్నారు. ఒకప్పుడు ఉపగ్రహాల ప్రయోగంపై డబ్బులు వృథా అని విమర్శలు చేసేవారని… ఇప్పుడు అవే ఉపగ్రహాలు మనకు సంపద తెచ్చిపెడుతున్నాయన్నారు.

భారత దేశం శాంతికి నిలయమని… బుద్ధుడు, గాంధీ లాంటి మహనీయులకు భారత్‌ పుట్టినిల్లని మోదీ అన్నారు. ప్రపంచం ఉగ్రవాదం నుంచి బయటపడేందుకు ఎంతకాలం పడుతుందని మోదీ ప్రశ్నించారు. ఉగ్రవాదం వైపు ఎవరున్నారో… మానవతావాదం వైపు ఎవరున్నారో ప్రపంచ దేశాలు తేల్చుకోవాలని సూచించారు. ఉగ్రవాదంలో మంచి చెడు లేవని… ఉగ్రవాదం ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదానికి నిర్వచనం చెప్పడంలో ఐరాస విఫలమైందన్నారు.