గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌


ఆరుగురు మావోయిస్టుల మృతి
భద్రాచలం, జూలై 7 (జనంసాక్షి) :
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో పడి ఉన్న ఆయుధాలను, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేతలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులు గడ్చిరోలిలోని వేటపల్లి వద్ద గత రాత్రి మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకుని కూంబింగ్‌ నిర్వహించడంతో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌ మృతిచెందిన వారి వివరాలు కూడా వెళ్లడి కాలేదు.