రిలయన్స్ అక్రమాలపై కేంద్రం చోద్యం
ప్రధానియే దోషి
అక్రమాలు ఆపే వరకూ పోరాడాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
కాకినాడ, జూలై 15 (జనంసాక్షి) :
రిలయన్స్ అక్రమాలపై కేంద్రం చోద్యం చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ తీవ్రంగా ఆరోపించారు.కాంగ్రెస్ దోపిడీ దొంగలపార్టీగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ బేసిన్ గ్యాస్లో అక్రమాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆద్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున టాందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కేజి బేసిన్ గ్యాస్ నిక్షేపాలు రాష్ట్రానికి చెందకుండా రిలయన్స్ సంస్థ దోచుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్నాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమయిందన్నారు. రిలయన్స్తో కుమ్ముక్కు కావడం వల్లే అక్రమాలను పట్టిచుకోవడం లేదన్నారు. నిన్నటి వరకు గ్యాస్లేదన్న రిలయన్స్ కేంద్రం ధరలు పెంచగానే మాట మార్చిందన్నారు. కుంభకోణాలు కాంగ్రెస్కు అలవాటేనని, నేల నుంచి ఆకాశం వరకు కూడా ప్రతిచోట కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడుతూ బొర్రలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ నేతలను ఒతాటిపైకి తేవడం చేతగాని కాంగ్రెస్ సమస్యలను పరిష్కరిస్తుందంటే నమ్మకం లేదన్నారు. తెలంగాణా సమస్య ఇంకా సమసిపోలేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. తెలంగాణాను ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ దిట్టగా మారుతోందని ఆరోపించారు. హైదరాబాద్తో కూడిన పది జిల్లా తెలంగాణాను ఏర్పాటు చేసేవరకు పోరాటాలు ఆగవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయిందన్నారు. సీమాంధ్ర, తెలంగాణానేతలు సమైక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పార్టీనేతలే విబేధించడం ఎంతవరకు సబబని నారాయణ నిలదీశారు. కేవలం ప్రకటనలతో తెలంగాణ ప్రజలను ఇంకా వెర్రిబాగులు అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలుచావు దెబ్బ తీసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ధర్నా కార్యక్రమానికి పెద్దఎత్తున మావపక్షాల నేతలు రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు ఇక్కట్లకు గురయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈఞసందర్భంగా వామపక్షాల కళాబృందాలు ఆటపాటలతో ప్రభుత్వంపై నిరసనలు తెలిపారు.