జడ్చర్ల ఎమ్మెల్యే తమ్ముడి దారుణ హత్య


మహబూబ్‌నగర్‌, జూలై 17 (జనంసాక్షి) :
దేవరకద్ర ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్‌మోహన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌ సోదరుడు జగన్‌మోహన్‌ బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో దేవరకద్ర ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలోని టీస్టాల్‌ వద్ద తన అనుచరులతో కలిసి టీ తాగుతున్నారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు జగన్‌మోహన్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో జగన్‌మోహన్‌ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ధర్మవరం మండలం పెద్దచింతకుంట నుంచి జగన్మోహన్‌ భార్య సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్నారు. అలాగే అదే స్థానం నుంచి చంద్రశేఖర్‌ భార్య కూడా రంగంలోకి దిగారు. ఉపసంహరణ గడువు ముగిసిన కొద్దిసేపటికే జగన్‌మోహన్‌ హత్యకు గురవ్వడం పట్ల స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ హత్య సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో జరిగిందా.. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.